Minister Srinivas Yadav | రేవంత్రెడ్డి భాష మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో తలసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. భేటీలో నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రచార సరళి, ఈ నెల 17 నుంచి జరిగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో, 25న జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోటికి అడ్డు అదుపూ లేని ఒక మూర్ఖుడిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిందని విమర్శించారు.
ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందిచక పోవడం విచారకరమన్నారు. తాము అంతకంటే ఎక్కువగా మాట్లాడగలమని, మాకు సంస్కారం అడ్డు వస్తుందని చెప్పారు. ప్రజలు కూడా గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో విధానాలపై ప్రజలకు వివరించాలే కానీ పరుష పదజాలం ఉపయోగించడంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ తమను తాము అతిగా ఊహించుకుంటున్నారని, తమ తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసి తమ పార్టీ అధిష్టానాల మెప్పు కోసం ముఖ్యమంత్రిపై పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఓడిపోతాననే భయంతోనే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పోటీకి దూరంగా ఉన్నారని విమర్శించారు. రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపినాద్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నాంపల్లి, కంటోన్మెంట్, గోషా మహల్ అభ్యర్థులు ఆనంద్ గౌడ్, లాస్య నందిత, నంద కిషోర్ వ్యాస్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.