మహబూబ్నగర్ : ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున చెంచులకు (24) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామంలో ఆదివాసీల కోసం రూ.120.96 లక్షల వ్యయంతో నిర్మించనున్న 24 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసి మంత్రి మాట్లాడారు. ఆదివాసీలు అడవుల్లోనే ఉంటారని, వారు అడవిని వదిలి వెళ్లలేరని అందువల్ల అడవి లాంటి ప్రాంతంలోనే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు.
ఇంతకుముందు వారు జనంలో కలిసే వారు కాదని, కానీ ఇప్పుడిప్పుడే వారు జనంలో తిరుగుతున్నారని మంత్రి తెలిపారు. అలాగే వారికి కల్యాణ లక్ష్మి, పింఛన్, రేషన్ బియ్యం వంటి ఎన్నో పథకాలు అందుకుంటున్నారని, త్వరలో మరిన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందిస్తామన్నారు. ఇక్కడే పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని దానిలో కూరగాయలు, పండ్లు వంటివి సాగు చేసుకోవచ్చని వారికి హామీ ఇచ్చారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద పని చేసుకోవాలి అనుకునే వారికి వంద శాతం సబ్సిడీ రుణాలు అందించే దిశగా కృషిచేస్తామని మంత్రి తెలిపారు.
వ్యవసాయానికి ఎండ కాలంలో కూడా నీళ్ల కొరత లేకుండా ఉండటం కోసం త్వరలో జిల్లాలోని ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చేలా ఒక ప్రాజెక్ట్ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా చెంచుల జోలికి వస్తే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. ఆదివాసీలు (చెంచులు) తో కలిసి మంత్రి భోజనం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామ రావు, గృహ నిర్మాణ సంస్థ అధికారి, తహసీల్దార్ బక్క శ్రీనివాస్, సర్పంచ్ సుధ, పాల్గొన్నారు.