మహబూబ్నగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్ మహానగరాన్ని మహా అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ నడుం బిగించిందని పర్యాటక శాఖ మంత్రి వీశ్రీనివాస్గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్, దుర్గం చెరువు వద్ద లండన్ తరహాలో అతిపెద్ద జెంట్వీల్, స్కైటవర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు వద్ద స్విట్జర్లాండ్ ప్రతినిధుల బృందంతో మంత్రి భేటీ అయ్యారు. బృందం ప్రతినిధులు మంత్రికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొలిదశలో దుర్గం చెరువు, ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తే వ్యూ ఎలా ఉంటుందో పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. లండన్ మాదిరిగా ఈ రెండు నిర్మాణాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. మరిన్ని పర్యాటక సొబగులు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో కొత్త నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తొలిదశలో స్విస్కు చెందిన ఇంటామిన్ ఎమ్యూజ్మెంట్ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, వీటిని సీఎం కేసీఆర్కు అందజేస్తామని అన్నారు. రెండో దశలో పాలమూరులోని మినీ ట్యాంక్బండ్, కొండపోచమ్మసాగర్ వద్ద జెంట్వీల్, స్కై టవర్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో స్విట్జర్లాండ్కు చెందిన ఇంటామిన్ ఎమ్యూజ్మెంట్ రైట్స్ ఉపాధ్యక్షుడు జెరాల్డ్ స్లెండర్ తదితరులు పాల్గొన్నారు.