మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 2 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.17.70 కోట్లతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జంక్షన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నామని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీర్చామన్నారు. శిల్పారామం, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, బైపాస్రోడ్డుతో పాలమూరు ముఖచిత్రం మారిపోయిందన్నారు. అంతకుముందు భూత్పూర్-మహబూబ్నగర్ రహదారిలో భగీరథ కాలనీ వద్ద ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించారు.
గాంధేయ మార్గంలోనే రాష్ర్టాన్ని సాధించామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోన గాంధీరోడ్ హైస్కూల్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ వంటి మహనీయులు చేసిన పోరాటం వల్లే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తమ బడిని బాగు చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, కౌన్సిలర్లు ఆనంద్కుమార్గౌడ్, నీరజ, ప్రవీణ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.