రవీంద్రభారతి, ఆగస్టు18: అనుచిత వ్యాఖ్యలతో బహుజనులను అణచివేసే కుట్రలు ఇక సాగవని, వాటిని తిప్పి కొడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వృత్తి కులాల పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అగ్రకుల అహంకారంతో బీసీ నేతలను ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకులు ద్వేషంతో వృత్తి కులాల పట్ల వివక్ష చూపుతున్నారని, వారు ఎన్నికల్లో ఎక్కడ నిలబడినా బహుజనులు సమైక్యంగా వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఖబర్దార్ రేవంత్ బహుజనుల జోలికొస్తే ఎన్నికల్లో ఎక్కడ నిలబడ్డా ఓడిస్తారని హెచ్చరించారు. శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ బహుజనుల తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 373వ జయంతి ఉత్సవాలను అధికారింగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్గౌడ్, శాసన మండలి చైర్మన్ బండ ప్రకాశ్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కే కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్రచారి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కుమ్రంభీం వంటి మహనీయుల జయంతులు, వర్ధంతులను ఘనంగా నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. పాపన్నగౌడ్ బహుజనులను సమీకరించి ఆనాటి నిజాం నిరంకుశ పాలకులను ఎదిరించి పోరాడిన యోధుడని గుర్తుచేశారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారింగా నిర్వహిస్తున్నదని చెప్పారు.