మహబూబ్నగర్ : ఎన్నటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా వెల్లడైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud )అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మంత్రి ఇంటికి చేరుకుని పటాకులు పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు వారి అస్తిత్వం కనుమరుగవుతుందని కుట్ర చేసి బీసీల ద్వారానే బీసీ మంత్రి నైనా నాపై కేసు వేయించారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెలిచి ఓట్లు సాధించి విజయం కైవసం చేసుకోవాలి. కానీ, ఇలా అక్రమంగా కోర్టు కేసుల ద్వారా తప్పుడు మార్గంలో గెలుపు కోసం ప్రయత్నించడం దుర్మార్గం. కనీసం తాగు, సాగు నీళ్లు ఇవ్వని వారిని ప్రజలు చీదరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని సమస్యలు తీరాయి.
మహబూబ్నగర్ గతంలో ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారు. ఒకప్పుడు వెనకబడిన జిల్లా ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఓర్వలేక ఆ ఇద్దరు ప్రధాన పార్టీలో ప్రతిపక్ష నేతలు కుట్రతో కేసు వేయించారని మండిపడ్డారు. బలహీన వర్గాలకు చెందిన నాలాంటి నేతలు ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుంటే ఓర్వలేక కొందరు కేసుల పేరుతో దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.
గత ఐదేళ్లుగా కేసుల పేరిట సోషల్ మీడియాలోనూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. జోగులాంబ అమ్మవారు, మన్యం కొండ స్వామి వాటి అశీస్సులు మాపై ఉన్నాయి. తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవని తేటతెల్లమైందన్నారు. నాపై కుట్రలు చేసిన వారి పేర్లను ఆధారాలతో సహా వెల్లడిస్తా. వారు తప్పనిసరిగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.