IND vs ENG 3rd ODI : లండన్లో లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ విజేతను తేల్చే మూడోది, ఆఖరిది అయిన మ్యాచ్ ఇవాళ జరుగుతోంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలిచారు. దాంతో ఆఖరి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా ఎడమ మోకాలికి గాయమైందని, వాపు కారణంగా అతడు మూడో వన్డేకు అందుబాటులో లేడని బీసీసీఐ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. బుమ్రాతోపాటు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలను కూడా తుదిజట్టు నుంచి తప్పించారు. వారి స్థానాల్లో కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. ఇంగ్లండ్ జట్టులో సాకిబ్ మహమూద్ స్థానంలో జోష్ టంగ్కు అవకాశం కల్పించారు.
టాస్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. తాము ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. ఈ పిచ్పై నలుగురు పేసర్లతో ఆడాలనుకున్నాం. గత మ్యాచ్లో మంచి స్థితిలో ఉండి కూడా మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయాం. ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకుని 280-300 పరుగులు లక్ష్యంగా పెట్టుకుంటాం అని తెలిపాడు. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందిస్తూ.. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోందన్నారు. మంచి స్కోరు సాధించి భారత్పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు.