Sonam Wangchuk : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసిన పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నుంచి తన మద్దతుదారులకు ఒక సందేశం పంపారు. ఈ నెల 20న ఢిల్లీలో జరగబోయే పార్లమెంట్ మార్చ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ నిరసనకు సంఘీభావంగా వాంగ్చుక్ ఆమరణ దీక్ష చేయగా, 21 రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేపీ చేపట్టిన ఉద్యమాన్ని రెండో స్వాతంత్య్ర ఉద్యమంగా అభివర్ణించారు. ఈ నెల 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పార్లమెంట్ మార్చ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తన ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకుని, అరెస్టు చేయడం అన్యాయమన్నారు. భయం లేని, అసమానత్వం లేని ఇండియా కావాలని ఆకాంక్షించారు. అయితే, సోమవారం సీజేపీ చేపట్టనున్న పార్లమెంట్ మార్చ్కు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఇదే సమయంలో తాము మార్చ్ నిర్వహించి తీరుతామని సీజేపీ నేతలు అంటున్నారు.
వాంగ్చుక్ ఆరోగ్యంపై శనివారం ఢిల్లీలోని ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిరాహార దీక్ష చేసినందున శరీరానికి అవసరమైన ఫ్లుయిడ్స్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కొన్ని సమస్యలున్నా చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. అంతకుముందు రోజు ఆయన వైద్యం తీసుకోవడానికి నిరాకరించారు. అక్కడ కూడా దీక్ష కొనసాగించారు. దీంతో వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వైద్యానికి నిరాకరించారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల్ని జోక్యం చేసుకోవాల్సిందిగా వైద్యులు కోరారు. ఇక, కోర్టు సూచనల ప్రకారమే వాంగ్చుక్ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.