బెంగళూరు: ఒక పారామెడికల్ విద్యార్థి తన ఇంట్లోని గదిలో అనుమానాస్పదంగా మరణించాడు. మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. సీలింగ్కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి వారు షాక్ అయ్యారు. (Paramedical Student) ఆ వ్యక్తి తండ్రితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మారప్పనపాళ్యకు చెందిన20 ఏళ్ల ఉదయ్ గౌడ పారామెడికల్ కోర్సు చదువుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఒక గదిలో అనుమానాస్పదంగా మరణించాడు.
కాగా, ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. ఉదయ్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఆ గదిని తెరిచి చూడగా ఉరికి వేలాడుతూ అతడి మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండటంతో మూడు రోజుల కిందట మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఉదయ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు తన కుమారుడు ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు కాలేజీకి వెళ్ళి రాత్రి 11 గంటలకల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడని ఉదయ్ తండ్రి తెలిపారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా తాను నాలుగు రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆ సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఉదయ్ ఇటీవల తిరుపతికి వెళ్లి వచ్చినట్లు వివరించారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది తమకు తెలియని ఆయన అన్నారు.