హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని తన కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు, ముందస్తు ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రజలందరినీ, మహిళలను ఉద్యోగులను, సకల జనులను ఏకీకృతం చేయడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. వేడుకలను వాడవాడనా, వీధివీధినా.. పల్లెలు, మండలాలు, జిల్లాలతో పాటు నగరంలోనూ వైభవోపేతంగా నిర్వహించాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ పూల పండుగ మాత్రమే కాదని, ఆడబిడ్డలను గౌరవించుకునే పండుగ అన్నారు. 25వ తేదీ నుంచి అక్టోబర్ 3వ వరకు జరిగే వేడుకల్లో మహిళంతా పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ స్ఫూర్తిని మరోసారి లోకానికి చాటాలని మంత్రి పిలుపునిచ్చారు.
చివరిరోజు ఎల్బీ స్టేడియం నుంచి వేలాదిమంది మహిళలతో, బతుకమ్మలతో వెయ్యి మందికిపైగా జానపద, గిరిజన కళాకారులతో ఊరేగింపుగా వెళ్లి.. ట్యాంక్బండ్పై నిమజ్జనం ఉత్సవాలు నిర్వహించాలన్నారు. రవీంద్రభారతిలో వివిధ రకాల సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ సారథ్యంలో 26, 27, 28 మూడు రోజులపాటు దేవి వైభవ్ నృత్యోత్సవాలు నిర్వహించబోతున్నారని సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికా రెడ్డి తెలిపారు. జాతీయస్థాయి కళాకారులు అమ్మవారి మహోన్నతత్వంపై నృత్య రూపంలో శాస్త్రీయ నృత్యాలని ప్రదర్శిస్తారని తెలిపారు. సాహిత్య అకాడమీ పక్షాన మహిళా రచయితలు, రచయిత్రులతో సదస్సును, అలాగే బతుకమ్మ విశిష్టతను చెప్పగలిగే పుస్తకాన్ని ప్రచురించాలని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ను మంత్రి ఆదేశించారు.
అధికార భాషా సంఘం సారథ్యంలో అక్టోబర్ 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ ఉత్సవాలని నిర్వహించాలని అధికార భాష సంఘం అధ్యక్షురాలు శ్రీదేవికి సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రధాన కార్యాలయం కావూరి హిల్స్లో కళాకారులతో బతుకమ్మ పండుగని దిగ్విజయంగా నిర్వహించాలని సూచించారు. మహిళలు, మహిళా ప్రతినిధులు అందరూ రవీంద్రభారతిలో ప్రతిరోజు బతుకమ్మ పండుగను ఆడుకునే విధంగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణను మంత్రి ఆదేశించారు. ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
హైదరాబాద్లోని ఎంపిక చేసిన జంక్షన్లతో పాటు బస్, రైల్వేస్టేషన్లు, ఎయిర్పోర్టుల వద్ద బతుకమ్మ ప్రతిమలని ఏర్పాటు చేసి, విద్యుద్దీపాలతో అలంకరించాలని చెప్పారు. విశ్వ విద్యాలయాల్లోనూ వేడుకల్లో విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. బతుకమ్మ వేడుకల కోసం సీఎం కేసీఆర్ రూ.10కోట్లు ప్రత్యేకంగా విడుదల చేశారన్నారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ సుల్తానియా, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ , తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికా రెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి , టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ , భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.