హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నంబర్లు వేయాలని, ఆగస్టు 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో కల్లు దుకాణాలను మంజూరు చేయాలని, టీసీఎస్, టీఎఫ్టీ కింద లైసెన్సులు మంజూరు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో తాటి, ఈత, ఖర్జూర, గిరుక చెట్లను నరికే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, బాధ్యులకు కనీసం మూడేండ్లు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు కింద గీత కార్మికులకు ఆధునిక సేఫ్టీ యంత్రాలను అందించాలని, రాష్ట్రవ్యాప్తంగా గీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గజ్జెల నగేశ్, రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మమ్మద్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కమిషనర్ ఎన్ఏ అజయ్కుమార్, జాయింట్ కమిషనర్లు కేఏబీ శాస్త్రి, ఎస్వై ఖురేషీ, సురేశ్రాథోడ్, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్లు ఏ చంద్రయ్యగౌడ్, జీ శ్రీనివాస్, అనిల్కుమార్రెడ్డి, ఈఎస్లు ఏ సత్యనారాయణ, టీ రవీందర్రావు, డీ అరుణ్కుమార్, కే విజయ్భాసర్, సీహెచ్ విజయ్, కే పవన్కుమార్ పాల్గొన్నారు.