4వ రోజూ సాగిన నిందితుల విచారణ
15 కోట్ల సుపారీపై వీడని సస్పెన్స్
రిమాండ్కు ఏడుగురు నిందితులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 కుత్బుల్లాపూర్: మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ఆర్నెల్లుగా కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ విచారణలో భాగంగా చివరిరోజైన శనివారం ఏడుగురు నిందితులకు పలు ప్రశ్నలు సంధించారు. రూ.15 కోట్ల సుపారీ, తుపాకుల సేకరణపై నోరు విప్పకపోవటంతో పోలీసులకు వాటి పూర్తి సమాచారం దొరకలేదు. శనివారంతో ఏడుగురు నిందితుల కస్టడీ ముగియడంతో సైబరాబాద్ పేట్బషీరాబాద్ పోలీసులు నిందితులను మేడ్చల్ కోర్టులో హజరుపర్చి రిమాండ్కు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నాలుగు రోజుల్లో నిందితులను మొత్తం 18 గంటల పాటు సీసీ కెమెరాల నిఘాలో ఉంచి విచారణ జరిపారు. నిందితులు మొదటిసారి పట్టుబడినప్పుడు ప్రాథమికంగా తెలిపిన సమాచారాన్నే కస్టడీలోనూ చెప్పారు. రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా మంత్రి శ్రీనివాస్గౌడ్కు, ప్రధాన నిందితుడు, అతని సోదరులకు మనస్పర్థలు వచ్చాయని, ఈ విబేధాలు 2017 నుంచి కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంత్రి హత్య కుట్రకు బీజం పడిందని నిందితులు విచారణలో వెల్లడించారు. హత్యకు కుట్రలో వేరేవాళ్ల పాత్ర ఉన్నదా? అన్న కోణంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసింది. సుపారీ, తుపాకుల అంశంపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో.. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించుకొన్నట్టు సమాచారం.