మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పు వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన హన్వాడ మండలంలోని పలు గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అయోధ్య నగర్ శివారులో షేక్ పల్లి నుంచి అయోధ్య నగర్ మీదుగా వేపూర్ వరకు రెండు కోట్ల యాభై ఐదు లక్షల 80 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత నట్టల నివారణ కార్యక్రమం లో పాల్గొని గొర్రెలకు,మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశారు. 16 లక్షల 70 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన తాగునీటి ట్యాంక్ను ప్రారంభించారు.
అనంతరం గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు. పెన్షన్లుజ్ రైతు బంధు ,రైతు బీమా, కల్యాణలక్ష్మి , ఆసరా వంటి కార్యక్రమాల కింద ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఉంటే ఇల్లు కట్టించి ఇస్తామని, ఇల్లు లేని వారందరికీ దశలవారీగా ఇండ్లు ఇస్తామని తెలిపారు. గ్రామ యువత ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.