ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు
మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం
మహబూబ్నగర్, హైదరాబాద్, ఫిబ్రవరి 14 : నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటయ్యాయి. నల్లగొండ మున్సిపాలిటీతో పాటు 42 శివారు గ్రామాలను కలిపి ‘నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’, మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలు, పరిసర ప్రాంతాల్లోని 142 గ్రామలతో ‘మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సోమవారం మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. అథారిటీల నిర్వహణకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆ జిల్లా కలెక్టర్ చైర్మన్గా, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీతోపాటు అధికారులు సభ్యులుగా ఉంటారు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆ జిల్లా కలెక్టర్ చైర్మన్గా, మున్సిపల్ కమిషనర్ వైస్చైర్మన్గా వ్యవహరిస్తారు. స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు సభ్యులుగా ఉంటారు. పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుతో నల్లగొండ, మహబూబ్నగర్ శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరగనున్నాయి.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై జీవో విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. కర్వెన, ఉదండాపూర్ ప్రాజెక్టులతో మహబూబ్నగర్ పర్యాటకంతోపాటు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డితో కలిసి జీవో కాపీలను విడుదల చేశారు.