మహబూబ్నగర్, అక్టోబర్ 19: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై పచ్చి అబద్ధాలు వల్లెవేస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ది కుటుంబ పాలన అంటూ విమర్శించిన రాహుల్ది.. తాతముత్తాతల నుంచి వారసత్వంగా కొనసాగుతున్న కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలే ఒక్కటిగా ఉంటూ.. ఒక్కోసారి ఒక్కొక్కరు అధికారంలోకి వస్తూ ప్రజలను నిండా ముంచుతున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు పాత రికార్డులను స్మరించుకుంటూ.. ‘నేనంటే.. నేను సీఎం’ అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుని లోలోపల కుమ్ములాడుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చే రూ.లక్ష కోట్లు కాలేదని, అలాంటిది రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు నెల రోజుల కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. ఇసుక, మైనింగ్, వైన్ మాఫియా అంటేనే కాంగ్రెస్ అని ఘాటుగా విమర్శించారు.