హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే పాలమూరు దశ మారిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించారు. మహబూబ్నగర్లో రెండు రోజుల పాటు కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పర్యటించారని, పర్యటనలో అవగాహన లేకుండా మాట్లాడి వెళ్లిపోయారన్నారు. కనీసం వచ్చేముందు జిల్లా పరిస్థితి ఎలా ఉంది? అని తెలుసుకొని కేంద్రమంత్రి మాట్లాడితే బాగుండేదన్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ ఏం చేయలేదని మాట్లాడుతారా? అంటూ మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ మొదట అనుమతి ఇచ్చిన విషయం పాండేకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో వచ్చి పాలమూరు – రంగారెడ్డి పథకంపై ఏం హామీ ఇచ్చారో కేంద్రమంత్రికి తెలుసా? అని నిలదీశారు. అలాగే మోదీ మెడికల్ కాలేజీ ఇచ్చారా?.. మహబూబ్నగర్ నుంచి వసలను కేసీఆర్ ఆపారా? మోదీ ఆపారా? అంటూ ధ్వజమెత్తారు. బీజేపీనేతలు కేవలం టూరిస్టుల్లా వచ్చి ఏదేదో మాట్లాడి పోతున్నారన్నారు.
నారాయణపేటకు సైనిక్ స్కూల్ ఇస్తామని హామీ ఇచ్చారని.. అది ఏమైందని ప్రశ్నించారు. పది లక్షల ఎకరాలకు నీరు పారించింది తెలంగాణ ముఖ్యమంత్రా..? మోదీయా..? అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతల మాటలు నమ్మేందుకు ప్రజలు పిచ్చోల్లు కాదని, దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కేవలం ఒకరిద్దరు వ్యాపారవేత్తల కోసం బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని, ఏ వర్గానికి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు. దేశంలో బీజేపీ ఆటలు ఎక్కడైనా సాగొచ్చని.. తెలంగాణలో సాగవన్నారు. బీజేపీ ప్రశ్నించే గొంతుకలను నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. దళితబంధు రాబోయే రోజుల్లో బీసీ బంధు, గిరిజన బంధు కూడా వస్తాయన్నారు.
రాజకీయాల కోసం టీఆర్ఎస్ పుట్టలేదని, ఉద్యమంలో నుంచి పుట్టిందన్నారు. తెలంగాణ కన్నా అద్భుతమైన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? ఢిల్లీ వేదికగా చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ప్రజల గొంతు నొక్కడమా? బీజేపీకి దమ్ముంటే ఉత్పత్తుల ధరల పెంపు ఆపాలన్నారు. రేషన్ షాపుల దగ్గర మోదీ ఫొటో పెట్టాలనే డిమాండ్ కాదని, సిలిండర్లపై మోదీ బొమ్మ వేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీనే.. స్వయంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు.. మరి ఎందుకు పట్టించుకోరంటూ విమర్శించారు.