హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ను ఎదుర్కోలేక గుర్తులతో రాజకీయం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కారును పోలిన గుర్తులతో ఓట్లు చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. బీజేపీకి ఎన్నిక సంఘం కూడా సహకరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ఎల్పీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు సరిగా లేదని మంత్రి అన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీని ఛీ కొడుతున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. ‘‘బీజేపీ నేతలు ప్రజలకు మాయమాటలు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్, కేంద్రం తమ చేతుల్లో ఉందని కుట్రలు చేస్తున్నారు. కారును పోలిన గుర్తులు వద్దంటున్నా కేటాయించేలా చేసి బీజేపీ తొలి కుట్రకు తెరలేపింది. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు. ఉప ఎన్నిక ఎందుకు తెచ్చారనేదానిపై బీజేపీ నేతలు సరైన కారణం చెప్పలేకపోతున్నారు. ఇన్నేళ్ల బీజేపీ పాలనలో మంచి నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. దుబ్బాక, హుజూరాబాద్లో గెలిచినా కూడా హామీలు నిలుపుకోలేని బీజేపీ ఇప్పుడు మునుగోడులో అవే హామీలు ఇస్తోంది’’ అంటూ విమర్శలు గుప్పించారు.
మత ఘర్షణలతో ఓట్లు దండుకునేందుకు కుట్ర..
తెలంగాణలో మత కల్లోలాలు రేపే కుట్రకు బీజేపీ తెర లేపుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మత ఘర్షణలు రేపి ఓట్లు దండుకోవడం తప్ప బీజేపీకి ఏమీ చేతకాదన్నారు. కేంద్రంలో చేసింది చెప్పుకోవడం చేతకాకనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల మీద విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. కేసీఆర్.. నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ను తరిమికొట్టారు.. సొరియాసిస్ లాంటి బీజేపీని కూడా సాగనంపుతారని అన్నారు. ధర్మం టీఆర్ఎస్ వైపు ఉంటే… అధర్మం బీజేపీ వైపు ఉంది. మునుగోడులో ధర్మమే గెలుస్తుంది అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ తరహా పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..?
‘‘మోడీ అనగానే ప్రజలకు గుర్తొచ్చేది గ్యాస్ సిలిండర్. పెరిగిన ధరలను గుర్తుంచుకొని బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు. చేతి వృత్తులని తెలంగాణ తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదుకున్నారా..? తెలంగాణ అంతటి సంక్షేమం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోందా..? హైదరాబాద్లో బీసీలకు తెలంగాణ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నట్టు.. ఢిల్లీలో ఆత్మగౌరవ భవనాలు ఎందుకు కట్టడం లేదు. వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు బీసీలకు కేటాయించిన మహనీయుడు కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు తమ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయని బీజేపీ నేతలు చెప్పగలరా..? అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బీజేపీకి లేదా..?’’ అని మంత్రి ప్రశ్నించారు.
కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమే..!
మునుగోడులో గెలిచిన తర్వాత దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ బయలు దేరుతారని మంత్రి అన్నారు. కేసీఆర్ తర్వాత ఎన్నేళ్లకైనా తెలంగాణకు సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమే అని అన్నారు. ‘‘కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది ఎవరు..? అని పార్టీలో ఎవరిని అడిగినా కేటీఆర్ అనే చెబుతారు.. అదే విషయాన్ని నేను చండూరులో చెప్పాను’’ అని మంత్రి అన్నారు.