Minister Srinivas Goud | గతంలో వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నాడని.. ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఎందుకని రేవంత్ రెడ్డి అంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురుశిష్యులు ఇద్దరూ ఒక్కటే అని ఆయన విమర్శించారు. ఆనాడు కరెంట్ అడిగిన రైతులను లాఠీలతో తొక్కిస్తే బాబుకు ఏం గతి పట్టిందో.. ఈనాడు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్నగర్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు మాత్రమే సరిపోతుందని అనడం రైతులను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి వక్రబుద్ధి బయటపడిందని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని తెలిపారు. రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.