మహబూబ్నగర్ : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నది. రాహూల్ గాంధీ(Rahul Gandhi) పొర్లు దండాలు పెట్టినా.. పది సార్లు పర్యటించినా మీ పార్టీ అధికారంలోకి రాదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు. బుధవారం మహబూబ్నగర్లో మీడియా సమావేశంలో కాగ్రెస్ విధానాలపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ..బీఆర్ఎస్ది కుటుంబ పరిపాలన అంటారు. అలా అయితే మీకున్న అర్హత ఏంటని సూటిగా ప్రశ్నించారు.
నీకు తెలంగాణ చరిత్ర తెలుసా? ఉద్యమంలో చనిపోయిన వారు కాంగ్రెస్ వల్లనే కాదా అని నిలదీశారు.
పదకొండు సార్లు మీకు అధికారం ఇస్తే సాగునీరు తాగు నీరు ఇవ్వకుండా పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి, ఆర్డీఎస్ బద్దలు కొట్టి నీళ్లు దోచుకుపోయారని విమర్శించారు. ఈ పదేళ్లలో దేశంలోనే అత్యధిక జీడీపీ తెలంగాణదని స్పష్టం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ మహారాష్ట్రలో విస్తరిస్తుంటే మీకు బుగులు పుట్టుకుంది. మీ అవసరాల కోసం బీసీలు, మైనార్టీలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని విమర్శించారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్కు టికెట్ జడ్చర్లలో ఇవ్వకుండ ఇతరులకు ఇవ్వడంతోనే బీసీలపై మీకున్న కపట ప్రేమను జనం తెలుసుకున్నారని చెప్పారు. మీరెన్ని రోడ్ షోలు చేసినా.. డ్రామాలు చేసినా జనం నమ్మరన్నారు. మా పార్టీలో చెల్లని వాళ్లకు టిక్కెట్లు ఇచ్చారు. మా నాయకుడు గల్లీలో ఉంటాడు. మీ నాయకుడు ఢిల్లీలో ఉంటాడు. పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు.