హైదరాబాద్: తెలంగాణ ప్రాంత విశిష్టతను గత పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) విమర్శించారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందగలిగిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని చెప్పారు. బుధవారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు రావడంపట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇక్కత్ చీరలకు పోచంపల్లి ప్రసిద్ధి అని, 2005 లోనే జియో ట్యాగింగ్ వచ్చిందన్నాదని చెప్పారు. పోచంపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు. ప్రపంచ పర్యాటక సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్గా భూదాన్ పోచంపల్లి నిలిచిన విషయం తెలిసిందే.
వందల ఏండ్లుగా ఉన్న రామప్ప ఆలయానికి ఇన్నాళ్లు ఎందుకు గుర్తింపు రాలేదని ప్రశ్నించారు. రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.300 కోట్లు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది రామప్ప ఆలయానికి, పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పారు. త్వరలోనే బుద్ధవనం ప్రాజెక్టుకు కూడా ప్రపంచ గుర్తింపు వస్తుందని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి పండుగను, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కుల వృత్తులను ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రదేశాలకు ప్రపంచ గుర్తింపుకోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు కేంద్రం రూ.100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.