మహబూబ్నగర్ : దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్.. మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ చౌరస్తా వద్ద దళిత బంధు పథకం లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు.
యాదయ్య అనే లబ్ధిదారునికి పాడి పరిశ్రమ యూనిట్, మన్యం, చంద్రయ్య అనే లబ్ధిదారులకు సెంట్రింగ్ యూనిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ద్వారా పేద దళితులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని మంత్రి తెలిపారు. దేశంలో ఎవరూ చేయని ఆలోచన కేసీఆర్ చేశారని ఆయన పేర్కొన్నారు.
దళిత బంధు పథకం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని, అర్హులైన పేద దళితులందరికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు అన్ని రంగాలు బాగుపడే పరిస్థితి వచ్చిందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన సంక్షేమానికి, అభివృద్ధికి కారణం ఎవరో ప్రజలంతా గుర్తించాలని.. సంక్షేమ సారధి సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రజానీకం అండగా ఉండాలని మంత్రి కోరారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ , రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, రైతుబంధు సమితి డైరెక్టర్, సర్పంచులు చంద్రకళ, శ్రీకాంత్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.