మహబూబ్నగర్ : యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు. మహబూబ్ నగర్ క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సదర్ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భారీ దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ దున్నలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వీటి ఠీవిని, విన్యాసాలను మంత్రి తిలకించారు. వాటితో కాసేపు విన్యాసాలు చేయించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సంప్రదాయంగా జరిగే ఈ సదర్ ఉత్సవాలు పట్టణంలో ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కుల వృతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చారని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధిక గొర్రెలు, పశు సంపదకు మన రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిందన్నారు. రాష్ట్రంలో అన్ని కులవృత్తుల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు.
ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, గొర్రె కాపరుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ బాలరాజు యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, సదర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ముడా డైరెక్టర్ సాయిలు యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట నర్సయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సత్యం యాదవ్, యాదవ ఉద్యోగ సంఘాల నాయకులు కృష్ణ మోహన్, బాలు యాదవ్, వెంకట్ రాములు, జుర్రు నారాయణ, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.