వికారాబాద్ (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట అర్బన్, నవంబర్ 28: కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు, కరెంట్ ఖతం చేస్తారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రాకుండా చేస్తారని విమర్శించారు. నిజమో, కాదో తెలియాలంటే కొడంగల్ పక్కనే ఉన్న రెబ్బనపల్లి, సేడం వెళ్లి కర్ణాటక ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, సిద్దిపేటలో, దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలంలోని రోడ్షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘కాంగ్రెస్ ఖతమైతేనే రైతుబంధు వస్తుది. కాంగ్రెస్ ఖతం కావాల్నో, రైతుబంధు ఖతం కావాలో ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి’ అని కోరారు. కాంగ్రెస్కు 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని, డిసెంబర్ 3న ఫలితాల్లో బీఆర్ఎస్ గెలవటం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావటం ఖాయమని తేల్చి చెప్పారు.
ఐదు గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతులను గోస పెడుతున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆ గ్యారెంటీలు అటకెక్కాయని, ప్రజలు ఆగమయ్యారని తెలిపారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని, లేకపోతే రాష్ట్రం పదేండ్లు వెనక్కి పోతుందని వెల్లడించారు. యూపీలో ప్రియాంకగాంధీ 6 నెలలు తిరిగి 403 స్థానాల్లో ప్రచారం చేసినా, ఆ పార్టీకి వచ్చింది రెండే సీట్లు అని గుర్తుచేశారు. ఆమె చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటుందని, కోటి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమాను తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆయా రోడ్షో కార్యక్రమాల్లో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ ప్రజల ఊపు చూస్తుంటే రేవంత్రెడ్డి ఓడిపోవడం ఖాయమనిపిస్తోందని హరీశ్ అన్నారు. కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్.. మాట తప్పారని, ఆయన మరోసారి మాట తప్పే టైం వచ్చిందని ఎద్దేవా చేశారు. కామారెడ్డి, కొడంగల్లో ఓడిపోతారని స్పష్టం చేశారు. సీఎం కాదు.. ముందు కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలవాలని గుర్నాథ్రెడ్డి అంటున్నారని, దీన్నిబట్టి రేవంత్కు ఓట్లు పడే పరిస్థితే లేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులే రేవంత్ను రేటెంతరెడ్డి అంటున్నారని, ఆయనను గెలిపిస్తే రాష్ర్టాన్ని కూడా అమ్ముకుంటారని ఆరోపించారు. లీడర్లను కొన్నా, ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం కొనలేడని స్పష్టం చేశారు.