హైదరాబాద్, మే 29(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం వ్యవసాయమేనని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఈ శాఖతోనే ప్రారంభించడం ఇందుకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా దశాబ్ది ఉత్సవాలను వ్యవసాయ శాఖతోనే ప్రారంభించడం ప్రభుత్వ ప్రాథమ్యానికి అద్దం పడుతున్నదని తెలిపారు. సోమవారం ఆయ న సచివాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం గర్వకారణమని అన్నారు.
వ్యవసాయ శాఖలో జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఆకాంక్షించారు. అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రతి చోట వైభవోపేతంగా నిర్వహించాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణకు 3వ తేదీన పండుగ వాతావరణం ఉట్టిపడేలా రైతు వేదికలను సుందరంగా ముస్తాబు చేయాలని సూచించారు. వ్యవసాయరంగంలో సాధించిన విజయాలను తెలియజేసేలా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
రైతులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయరంగానికి జరిగిన మేలును వివరించాలని సూచించారు. ఆయా మారెట్ల పరిధిలో ఉత్తమ రైతులు, ఉత్తమంగా, నాణ్యమైన పంటలు పండించే రైతులను గుర్తించి సతరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్య రంగంగా వ్యవసాయమే ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, అన్ని జిల్లాల డీఏవోలు పాల్గొన్నారు.