నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, ఏప్రిల్ 8: దేశంలో రాజకీయంగా ప్రధాని మోదీని ఢీకొట్టే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్కే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అంబానీలకు దేశ ప్రజల ఆస్తిని దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. సీనియర్ నేత అద్వానీని రాజకీయంగా కనుమరుగు చేసి అక్రమంగా పైకొచ్చిన నేత మోదీ అని విమర్శించారు. శనివారం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులోని నూతన మార్కెట్ యార్డులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ రవీందర్రావుతో కలిసి మంత్రి ముఖ్యఅథితిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయాలలో ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్మున్న మొనగాడు సీఎం కేసీఆర్ ఒక్కరేని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్నదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తానని చెప్పడంలో గొప్పతనం ఏముందని ప్రశ్నించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏటా రూ.550 కోట్ల ఆదాయం వస్తున్నదని, ఇందులో కేంద్రం ఇచ్చేది ఏమిటో మోదీ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం ఆహ్వానిస్తున్నదని వెల్లడించారు. సమావేశంలో మంత్రి సింగిరెడ్డి సతీమణి వాసంతి, మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తదితలు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా బుగ్గారంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై మంత్రి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరువీరులకు గౌరవ సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ చేర్చేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాకముందు, వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు, అభివృద్ధిపై గ్రామ కూడళ్లలో చర్చపెట్టాలని చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వారి కుట్రలు, కుతంత్రాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్దేశించారు. కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిన్రో చెప్పాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. షాద్నగర్ నియోజకవర్గంలోని షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఎన్ గార్డెన్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ప్రధాని రాష్ర్టానికి వస్తున్న ప్రతిసారీ ఏమైనా మేలు జరుగుతుందని ప్రజలంతా ఆశిస్తారని, తీరా చూస్తే ఎలాంటి లాభం ఉండదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే.. కేంద్రం ఓర్చుకోవడం లేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మార్చే ‘ఐటీఐఆర్’ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తే ఫార్మా సిటీకి, మెట్రో ఫేజ్-2కు సహకరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల జాతీయ హోదాకు ఇప్పటికీ మోక్షం లేదని చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.