వేములవాడ, జనవరి 25: రాష్ట్రంలో గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ఈ నెలతో ముగియనుండగా తాము ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని పంచాయతీరాజ్ శాఖ మం త్రి సీతక స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి గురువారం ఆమె దర్శించుకున్నారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రెం డు, మూడు రోజుల్లో సమావేశం నిర్వహించి పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అధికారంలోకి రాగానే పం చాయతీల బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తుచేయగా, గత ప్రభుత్వం 16 నెలలుగా పంచాయతీలకు రూ.1,200 కోట్లు చెల్లించలేదని చెప్పారు. ఉద్యోగులకు ప్రతినెలా నాలుగో తేదీలోగా జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఆచార వ్యవహారాలను ధ్వంసం చేస్తారా?
దేశంలో కొందరు పలానా దేవుళ్లనే కొలువాలని స్థానిక ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. రాజన్న తమ ఇలవేల్పు అని, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు. ఆదివాసి కుటుంబంగా సమ్మక సారలమ్మ జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీ ఉన్నదని చెప్పారు.