హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ డీఎస్ ఎస్ భవన్లో శనివారం ఆమె విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. 2022-23 బడ్జెట్ ప్రగతి నివేదికను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశంలోనే ఏ సీఎం కూడా చేయని రీతిలో ఎస్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, బడ్జెట్లో 250 జీవోలను విడుద ల చేయడమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. ఆదివాసీ, గిరిజనుల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారని తెలిపారు. ఆదివాసీ గూడేలు, తండాలకు తెలంగాణ సర్కారు రూ.2 వేల కోట్లతో 3,152.41 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్లను మంజూరు చేసిందని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 7 యూనివర్సిటీల్లో ఒకో వర్సిటీలో 500 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా బాలబాలికలకు వేర్వేరుగా హాస్టళ్ల నిర్మాణం చేపట్టిందని, ఇందుకు రూ.140 కోట్లు కేటాయించిందని తెలిపారు. 2,471 గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి అడవిబిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసిందని చెప్పారు. అన్నిచోట్లా పంచాయతీ భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని, ఒకో భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.600 కోట్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. 3,467 గిరిజన ఆవాసాలకు రూ.324 కోట్లు ఖర్చు చేసి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించిందని, తద్వారా పేద ఆదివాసీ, గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతున్నదని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాతో పాటు బాన్సువాడలో గిరిజన గురుకుల పాఠశాలల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అనుమతిచ్చారని, ఒకో గురుకులానికి రూ.12 కోట్ల చొప్పున మంజూరు చేశారని వెల్లడించారు. హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.71 కోట్ల 95 లక్షల వ్యయంతో 32 ఆదివాసీ, బంజారాభవన్లను ప్రభుత్వం నిర్మించిందని, దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది రూ. 47 కోట్లతో 35 నియోజకవర్గాల్లో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్లను నిర్మించనున్నదని వెల్లడించారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం ద్వారా ఈ ఏడాది 200 మందికి లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా దాదాపు 8 లక్షల మంది గిరిజన రైతులకు రూ.8 వేల 305 కోట్లు అందించిందని వివరించారు.
రాష్ట్రంలో అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే సీఎం కేసీఆర్ అనుమతితో పట్టాల పంపిణీ కల సాకారం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 2005 డిసెంబర్ 13కు ముందు వరకు సాగులో ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తూ పోడు పట్టాలను అందిస్తామని వివరించారు. సమావేశంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జీసీసీ చైర్మన్ ఆర్ వాల్యానాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కాగా, ఈ నెల మూడో తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని గిరిజన సంక్షేమశాఖ అధికారులు, ఐటీడీఏ పీవోలు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఆర్సీవోలను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.