హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా త్వరలోనే వెలువడుతాయని చెప్పారు. బుధవారం సచివాలయంలో తనను కలిసి వినతిపత్రం అందజేసిన మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ నేతలతో మంత్రి ఈ సందర్భంగా హామీనిచ్చారు. దీంతో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి, నాయకులు శంకరమ్మ, లక్ష్మి, పద్మ, పుష్ప తదితరులు సీఎం కేసీఆర్కు, మంత్రి సత్యవతికి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ భారతి హొలికెరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో ఎకడ లేనివిధంగా మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలన్నదే తమ అభిమతమని ఆడెపు వరలక్ష్మి పేర్కొన్నారు. అయితే, కొన్ని యూనియన్లు పనిగట్టుకొని ధర్నాలకు దిగుతామన్న సంకేతాలు ఇస్తున్నాయని చెప్పారు. మినీ అంగన్వాడీలెవరూ ఆ కార్యక్రమాలకు వెళ్లొద్దని సూచించారు. ఎలాంటి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం వినతిపత్రాల ద్వారా తమ సమస్యను పరిష్కరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని వరలక్ష్మి కోరారు.