మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అటు పట్టణాలు ఇటు పల్లెలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod ) అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవంలో పాల్గొన్నారు.
ఆమె మాట్లాడుతూ పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం పట్టణ ప్రగతిని ప్రారంభించిందన్నారు. ‘ తెలంగాణ రాక ముందు మున్సిపాలిటీల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండేది. వీధులన్నీ చెత్తమయంగా దర్శనమిచ్చేవి.సీఎం కేసీఆర్(CM KCR)పాలనలో పట్టణాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు.స్వరాష్ట్రంలో అన్ని రంగాలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నాయని వెల్లడించారు.
పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా పట్టణాలు నిలుస్తున్నాయని అన్నారు.పట్టణ ప్రగతి పట్టణాల్లో అద్భుత ఫలితాలను ఇస్తోందని ఆమె వివరించారు.మహబూబాబాద్ పట్టణం రూ.100 కోట్లతో జరుగుతుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమయ్యిందని అన్నారు.