మహబూబాబాద్ : దేవుడు దివ్యాంగులను చిన్న చూపు చూసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. సీఎం కేసీఆర్ వీరిని అన్ని విధాల ఆదుకుంటున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు 3,016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.
జిల్లాలో రూ. 90 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటీలు, మోటార్ సైకిళ్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డితో కలిసి పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ట్రాన్స్ జెండర్స్ పాలసీ కూడా తీసుకువస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేకసార్లు దివ్యాంగుల కోసం ఉపకరణాలు పంపిణీ చేశామన్నారు.
ఈరోజు ఈ ఉపకరణాలు అందని దివ్యాంగులకు మరోసారి అందరికి ఇచ్చేలా వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధించిన నిధులు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
దివ్యాంగుల శాఖ సాంకేతికంగా దళిత సంక్షేమ శాఖలో ఉన్నప్పటికి దీని నిర్వహణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుందని, కావున దివ్యాంగులకు ఎలాంటి అవసరాలు ఉన్నా వెంటనే ఆ ప్రతిపాదనలు సమర్పిస్తే అందుకనుగుణంగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతా లెనీనా, జిల్లా షెడ్యూల్ క్రాప్ట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ సన్యాసయ్య పాల్గొన్నారు.