Minister Satyavathi | ఈ రోజు నా జీవితంలో పండగ రోజని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉండడం, రాష్ట్ర అభివృద్ధికి రూ.వేలకోట్లు కేటాయించడం ఒక ఎత్తయితే.. తాను పుట్టిన ప్రాంత అభివృద్ధి నిధులు కేటాయించకోవడం మరొక ఎత్తు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో మంత్రి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సోయి లేకపోవడంతో అనేక ఇబ్బందులుపడ్డామన్నారు. గతేడాది తన తల్లిదండ్రులను కోల్పోయానని, ఈ ప్రాంత అభివృద్ధి నా బిడ్డ చేసింది అని సంతోషపడే మొదటి వ్యక్తులు తన తల్లిదండ్రులేనన్న మంత్రి.. ఇద్దరు ప్రస్తుతం లేకపోవడం బాధాకరమంటూ భావోద్వేగానికి గురయ్యారు.
గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా వంతెనలు నిర్మించకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి రూ.450కోట్లు కేటాయిస్తే.. ఇందులో రూ.150కోట్లు ఈ ప్రాంతానికి కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాభివృద్ధికి రూ.400కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పనులన్నీ పూర్తవుతాయన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రిగా నేడు పలు నియోజకవర్గాలకు తన శాఖల నుంచి రూ.వేలకోట్లు ఇచ్చే అవకాశం దక్కిందన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా ఆడపడుచులకు ప్రభుత్వం చీరెలను కానుకలుగా ఇస్తుందన్నారు. ఏటా కోటి మందికి రూ.500కోట్లు ఖర్చు చేస్తూ చీరలను అందిస్తుందన్నారు.