మహబూబాబాద్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై మంత్రి సత్యవతి రాథోడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ పాపాలు పెరిగినట్లు దేశంలో ధరలు పెరుగుతున్నాయి. కనీసం ఆ ధరలు తగ్గేలా వీరు ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేస్తే బాగుంటుంది అని బండి సంజయ్కు సత్యవతి చురకలంటించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ ఆఫీసులో వినాయకుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి సత్యవతి పాల్గొని ప్రసంగించారు. మానుకోట వాసులకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నేడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిర్వహించిన రెండో రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. గణేష్ చతుర్థి సందర్భంగా ఎమ్మెల్యే 9 రోజులు అన్నదానం నిర్వహిస్తున్నారు. వివిధ పూజ కార్యక్రమాలు చేపడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రజలలో భక్తిభావం కలిగే విధంగా చేస్తారు. ఎమ్మెల్యేకు విఘ్నేశ్వరుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.