హైదరాబాద్: జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన కుమ్రం భీం ఆదివాసీల ఆరాధ్యదైమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కుమ్రం భీమ్ జయంతి సందర్భంగా మంత్రి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కుమ్రం భీం తన చిన్ననాటి నుంచే పోరుబాట పట్టారని, ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం.. బానిసత్వపు సంకెళ్లు తెంచడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. కుమ్రం భీం జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.
ఆదివాసీ యోధుడు కుమ్రం భీం ఆశయాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని చెప్పారు. మా తండాలో మా రాజ్యం అన్న ఆయన నినాదాన్ని ప్రభుత్వం నిజం చేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న సుదీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చిన సీఎం కేసీఆర్.. తండాలో గిరిజనులకు పాలనాధికారాన్ని అందించారని చెప్పారు. అడవిబిడ్డల ఆత్మగౌరవ ప్రతీకైన కుమ్రం భీం జయంతి సందర్భంగా గిరిజనులు ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకోవాలని సూచించారు.