మహబూబాబాద్ : నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందించేందుకే ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని అమినాపురంలో నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. పలువురు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్నారన్నారు.
దేశంలో అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో అన్ని సదుపాయాలతో విద్యనందించడంతో పాటు అన్నిరంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఫలితంగా తల్లిదండ్రుల నుంచి ఆదరణ పెరుగుతుందన్నారు. దేశంలో చివరిగా ఏర్పాటైన రాష్ట్రం తెలంగాణ అని, అభివృద్ధిలో మాత్రం ముందుందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. త్వరలో మహబూబాబాద్లో మరో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, జడ్పీ అధ్యక్షురాలు బిందు, ఆర్డీవో రమేశ్, డీఎస్పీ సదయ్య, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.