హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ‘అది రాత్రి 11 : 15గంటలు. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. అటు వైపు నుంచి ఓ విద్యార్థి ఆందోళనలో టెన్షన్తో మాట్లాడుతోంది. మేడం మాది మహబూబ్నగర్. నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. నాకు ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయి. చాలా బాధగా ఉంది. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుంది. ఏం చేయాలో తోచడంలేదు. నన్నేం చేయమంటారు’ అంటూ ఆవేదనతో మాట్లాడుతోంది. ఈ ఫోన్ వచ్చింది ఎవరికో కాదు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికే. మరుక్షణమే స్పందించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆ విద్యార్థినికి నచ్చజెప్పి సమాధానపర్చారు. పరీక్షల్లో ఫెయిలైతే జీవితం ముగిసినట్టు కాదని.. బంగారు భవిష్యత్తు ఉందని సావధానంగా నచ్చజెప్పారు. శ్రీనివాస రామానుజన్ నుంచి మొదలుకొంటే ఎంతో మంది ఫెయిలయ్యారని.. వారు ఫెయిలైన తర్వాత ఊరుకోలేదని.. పట్టుదలతో శ్రమించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారని ధైర్యాన్ని నూరిపోశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలొస్తున్నాయి.. కష్టపడి చదివి వాటిల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని హితబోధ చేశారు. ఇలా 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత విద్యార్థిని పూర్తిగా తేరుకోగా, మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఆత్మహత్యలు బాధాకరం
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. చిన్న వయస్సులో కఠిన నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే బాధనిపిస్తున్నది. దయచేసి విద్యార్థులెవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. ఇలాంటి నిర్ణయాలతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నట్టే. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ద్వారా పరీక్షలు రాసి మీ మిత్రులతో పాటే మీరు పాసయ్యే అవకాశం ఉన్నది. ఉన్నత చదువులను అందిపుచ్చుకోవచ్చు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొనేటప్పుడు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుకుతెచ్చుకోవాలి. పదో తరగతి విద్యార్థులకు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుంటాయి. ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సన్నద్ధం కావాలి.
-విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి