బడంగ్పేట, సెప్టెంబర్ 12: ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అందరూ అండగా నిలువాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతున్నారని స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధలోని జిల్లెలగూడలో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబిత మాట్లాడుతూ..ఈ నెల16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే పాలమూరు ప్రాజెక్ట్ ఓపెనింగ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివెళ్దామని పిలుపునిచ్చారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే జిల్లాగా పేరున్న పాలమూరుకు నేడు వివిధ రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం ప్రజలు వస్తున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ చాణక్యం, చిత్తశుద్ధితో దక్షిణ తెలంగాణ కల నిజమవుతున్నదని కొనియాడారు. వికారాబాద్ జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్తోపాటు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్ట్తో మేలు జరుగుతుందని తెలిపారు. మహేశ్వరం, కందుకూరు మండలాలకు కృష్ణాజలాలను తీసుకొచ్చి 17న జిల్లాలో ప్రతి గ్రామంలోని గ్రామ దేవతల పాదాలు కడగాలని సూచించారు. గ్రామగ్రామాన పండుగ వాతావరణంలో సంబురాలు చేసుకుందామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల, మతాలకు అతీతంగా పేదలకు డబుల్ బెడ్రూంలు కేటాయిస్తుంటే.. ప్రతిపక్షాల గుండెలు అదురుతున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.