హైదరాబాద్: పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని (CM KCR) మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని, హైదరాబాద్లో ప్రజలు ఏ నీరు తాగుతున్నారో.. అదే నీరు మనమంతా తాగుతున్నామంటే ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు ఇస్తున్న సంక్షేమాల ప్రభుత్వానికి మద్దతు తెలపన్నారు. నియోజకవర్గమే తన ఇల్లని, ప్రజలే తన కుటుంబసభ్యులని చెప్పారు.
ప్రజాసేవకే తన జీవితం అంకితమని తెలిపారు. కరోన వచ్చినా, వర్షాలు వచ్చి వరదలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రజలతోనే ఉన్నానని చెప్పారు. ఇంతవరకు కనిపించని వాళ్లు.. నేడు ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. ఒక్కసారి ఆలోచించి, పనిచేసే వారిని గుర్తించాలని సూచించారు. రూ.6600 కోట్లతో మహేశ్వరం వరకు మెట్రో రైలు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కందుకూరు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. మీర్ఖాన్పేటలో మెడికల్ కాలేజీ, 450 పడకల దవాఖాన వస్తుండటంతో మన ముంగిట్లోకి వైద్య సేవలు రానున్నాయని చెప్పారు.
నియోజకవర్గంలో లా కళాశాల ఏర్పాటుచేసుకుని విద్యాభివృద్ధికి బాటలు వేసుకున్నామన్నారు. ఒక ఆడబిడ్డగా పోటీచేస్తున్నానని.. మద్దతివ్వాలని కోరారు. ఇష్టంలేకున్నా పోటీ చేస్తున్న వ్యక్తులను కాకుండా.. ఐదేండ్లు జనంమధ్యలో ఉండే తననే గెలిపించాలన్నారు. ప్రజల్లో చిచ్చుపెట్టి, అభివృద్ధి పట్టని పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అభివృద్ధి సర్కార్కు అండగా ఉండండి. చేవెళ్లలో చెల్లని రూపాయి, మేడ్చల్లో చెల్లని రూపాయి మహేశ్వరంలో చెల్లుతుందా? ఆలోచించాలన్నారు.