హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana Ooru – Mana Badi ) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశం ముగిసిన అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. మన ఊరు – మన బడి పురోగతిపై సమావేశంలో చర్చించామన్నారు. మొదటి దశలో 50 శాతం పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ పాఠశాలల్లో జూన్ 12వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని, ఆ బాధ్యతలను కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది నుంచే 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం బోధన అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు బడిబాట నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. జూన్ 12న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పాఠశాలల బాగుకు సర్పంచ్లు చొరవ తీసుకోవాలి. పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు కలిసి రావాలని కోరారు. ఆట స్థలాలున్న పాఠశాలలకు క్రీడాసామాగ్రి ఇస్తామని పేర్కొన్నారు. ఐటీ, డిజిటల్ అంశాలపై మంత్రి కేటీఆర్ చేసిన సూచనలను పరిశీలిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.