హైదరాబాద్ : ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువులు చెప్పిన విషయాలను అనుసరించి సమయాన్ని వృధా చేయకుండా చదివితే విజేతలుగా నిలుస్తారని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు నిరూపించారని మంత్రి అన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను గురువారం నగరంలోని ఎస్సీఈఆర్టీ గోదావరి ఆడిటోరియంలో మంత్రి సబిత సన్మానించారు.
ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్యను అందించడం వల్లే ఉత్తమ ఫలితాలు లభిస్తున్నాయని, ప్రయివేట్ కళాశాలలకు ధీటుగా పూర్తి స్థాయిలో విద్యార్థులకు సదుపాయాలను కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్షిక పరీక్షలకు ముందునుండే సిద్ధం చేస్తున్నామని, అవసరమైతే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆదివాసి ఖిల్లాగా పేరున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం ప్రశంశనీయమని పేర్కొన్నారు.
జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రత్యేకంగా సైకాలజిస్టులతో సలహాలను ఇప్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఐఐటీ, నీట్ ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన శిక్షణ కూడా సత్పలితాలను సాధించిందని మంత్రి తెలిపారు. పరీక్షలు సమీపించిన సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులను గ్రూప్లుగా విభజించి వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, లెక్చరర్లు పాల్గొన్నారు.