ఖమ్మం : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం కాల్వ ఒడ్డు మున్నేరు పరివాహక ప్రాంతాన్ని మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కలిసి మంత్రి సందర్శించారు. మున్నేరు వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
వరద ముంపు ప్రాంతాల వారిని ఇప్పటికే స్థానిక నాయబజార్ కళాశాలలో పునరావాసం కల్పించినట్లు మీడియాకు వెల్లడించారు. వారికి భోజనం, తాగునీరు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ఉధృతిపై సహాయక చర్యలకై అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగలేదని, అయినప్పటికీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగుతున్న వాగుల వద్ద తగు హెచ్చరికలను, వేరే దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వర్షకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నచిన్న వాగులను దాటేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో కూడా వరద ఉదృతిని పరిశీలించనున్నామని, అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వరద ఉధృతి, సహాయక చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం