కృష్ణా(ఆంధ్రప్రదేశ్) : విశ్వాసానికి మారుపేరు అయినా ఓ కుక్క పట్ల తన యజమాని అభిమానం చాటుకున్నాడు. శునకంపై ఉన్న అభిమానాన్ని ఆ యజమాని వినూత్నంగా తెలిపాడు. ఐదేళ్ల క్రితం చనిపోయిన కుక్కకు.. ప్రతి ఏడాది ఆ శునకం వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది వినూత్నంగా ఆ శునకం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు యజమాని.
కృష్ణ బాపులపాడు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన సుంకర జ్ఞాపకరావు అనే రైతు ఓ కుక్కను తొమ్మిదేళ్లుగా పెంచుకున్నాడు. దానికి అంజి అని నామకరణం చేశాడు. అయితే ఆ శునకం ఐదేళ్ల క్రితం చనిపోయింది. దీంతో ఆ కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ప్రతి ఏడాది ఆ శునకం వర్ధంతి రోజున ఊరంతా భోజనాలు పెడుతున్నాడు. ఈ ఏడాది మాత్రం కుక్క కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించి.. విగ్రహావిష్కరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు కూడా జరిపించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టాడు. ఈ శునకం తమ పిల్లల్లో ఒకరు అని జ్ఞాపకరావు పేర్కొన్నారు.