ఖమ్మం, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావని, ఆయనకంటే ఊసరవెల్లే నయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మలపై దయతలచి సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, లేకపోతే పదేండ్ల క్రితమే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయేదని చెప్పారు. అలాంటి తుమ్మల నేడు కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలే దగ్గరుండి ఆయనను ఇంట్లో కూర్చోబెడతారని తెలిపారు. అవసరానికి తగినట్టు పార్టీలు మారడం తుమ్మలకే చెల్లిందని, పదవుల కోసమే తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తుమ్మలకు ఎప్పుడూ లేదని విమర్శించారు. అనంతరం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘పాలేరు సభలో సీఎం కేసీఅర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అబద్ధాలు చెప్తూ మోసం చేయాలని చూడడం సరికాదు.
రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క కాంట్రాక్ట్ తీసుకున్నట్టు నిరూపించినా నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా. నాపై అసత్య ఆరోపణలు సరికాదు’ అని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.