హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) అంటేనే స్కాంల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు (Telangana) ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం (Khammam) సభలో కాంగ్రెస్లో చేరినవారంతా అవకాశ వాదులేనని చెప్పారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) మెచ్యూరిటీ లేని లీడరని విమర్శించారు. నాయకత్వం వద్దని పక్కకు జరిగిన నేత రాహుల్ అని చెప్పారు. కాంగ్రెస్ను నట్టేట ముంచి పక్కకు జరిగిన నేత ఖమ్మం వచ్చి మాట్లాడారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం పోటీ ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. అక్కడ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా అని నిలదీశారు. ఆ పార్టీ నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ రైడ్లు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు అన్నింట్లో కుంభకోణమేనని ఆరోపించారు. ఖమ్మం సభ సందర్భంగా ఆ పార్టీలో చేరిన నేతల్లో ఎవరికీ బీఆర్ఎస్ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. తెల్లం వెంకట్రావ్, పిడమర్తి రవి, కోరం కనకయ్య టికెట్ ఇచ్చినా గెలవలేదని చెప్పారు.