ఖమ్మం: కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు. ఓ ఓడిపోయిన వ్యక్తికి మ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు (CM KCR). తమది గెలిచినా ఖమ్మమే.. ఓడిపోయినా ఖమ్మమేనని స్పష్టం చేశారు. కానీ కొందరు అలా కాదని.. ఒకసారి ఖమ్మం వైపు చూసి, మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. కానీ, తమది అలాంటి ఆలోచన కాదన్నారు. ఖమ్మం పట్టణలోని నెహ్రూ నగర్ జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఇక్కడి భూమి పుత్రుడినని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కసారి మంత్రి పదవి వచ్చినందుకే ఇంత అభివృద్ధి చేసుకున్నామని.. మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు.
కొందరికి కడుపు నొప్పి వస్తే, అందరికీ రావాలని భావిస్తున్నారని విమర్శించారు. వారి స్వార్ధ రాజకీయాల కోసం జిల్లాను బలి పెడదామనుకుంటే అందుకు ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు. సమయానుకూలంగా అందరికి అవకాశాలు రావాలని అనుకోవాలన్నారు. కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ముందుందని దానిని వెనుకకు నెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో బీఆర్ఎస్ (BRS) క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.