ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay kumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్లో (BRS) ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసిన చరిత్ర పొంగులేటిదని ఆరోపించారు. తనను తాను అతిగా ఊహించుకుంటున్నాడని, ఆయనకు ఓ సిద్ధాంతం, విలువ లేవని విమర్శించారు. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నాడని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో (Khammam) పువ్వాడ అజయ్ ఓటమి ఖాయమని పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని ఫైరయ్యారు. పేదలను దోచిన దోపిడీదారులే పొంగులేటి పంచన చేరారని విమర్శించారు. పద్ధతి మార్చుకోవాలని సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నిసార్లు చెప్పినా మారలేదని చెప్పారు.
బీఆర్ఎస్లో ఉండి బాగా సంపాదించాడని, ఇప్పుడు అదే డబ్బుతో రాజకీయ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొంగులేటి డబ్బులకు ఖమ్మం ప్రజలు అమ్ముడుపోరని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి.. ఇవాళ ఎలాంటి స్థితిలో ఉన్నాడని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పారు. కాంట్రాక్టర్గా పనులు చేయకుండానే వందల కోట్లు బొక్కావని ఆరోపించారు. ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక ఫ్రస్టేషన్లో ఉన్నారని, అందుకే బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారని వెల్లడించారు. పొంగులేటి ఆత్మీయ సమావేశాలకు జనాల స్పందన కరువైందని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిమీద కొందరు కడుపులో విషం నింపుకున్నారని చెప్పారు.