మునుగోడు : మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న బీజేపీకి మునుగోడు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం మునుగోడు మండలంలోని కొరటికల్, జోలం వారి గూడెంలో ఆయన సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్తో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసునన్నారు. 24 గంటల ఉచిత కరెంటు కావాలంటే టీఆర్ఎస్కు ఓటు వేయాలని, 6 గంటల కరెంటు కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ ఉప ఎన్నిక మోదీ, కేసీఆర్కు మధ్య నడుస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా మోటార్లుకి మీటర్లు పెడితే ఏమవుతుందని మాట్లాడుతున్నాడన్నారు. మోదీ గత ఎన్నికల్లో నల్లధనం వెనక్కి తెచ్చి 15 లక్షలు అకౌంట్లలో వేస్తా అన్నాడనీ.. కానీ ఆ మాట ఇప్పటికీ నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. వంట గ్యాస్ ధరను రూ.400 నుంచి రూ.1200కు పెంచినందుకు మోదీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా బీజేపీ ప్రభుత్వం పెంచింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల గెలిచిన రెండు నెలలో డబుల్ బెడ్ రూంలు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
పని చేసే అభ్యర్థి గెలిపించండనీ, కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నమ్మి మోసపోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో కేసీఆర్కు దేశవ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక.. మోదీ, అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని అన్నారు. మోదీ, అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని స్పష్టం చేశారు. అమ్ముడుపోయి మునుగోడు ఎన్నిక తెచ్చిన రాజ గోపాల్ రెడ్డిలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని, వారు ఉద్యమకారులని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలన్నారు.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100కోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభాలతో బీజేపీ కొనుగోలు కుట్రను తిప్పి కొట్టిన ఎమ్మెల్యేలను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన అభినందించారు. బీజేపీ మోదీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకుందని, వారి ఢిల్లీ పీఠం కదులుతుందనే ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల దోస్తున్న బీజేపీకి తగినశాస్తి జరుగుతుందని హెచ్చరించారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఖమ్మం కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి, కూరాకుల వలరాజు, టీఆర్ఎస్వీ నాయకులు సిరిగమల్ల కిశోర్, కొరటికల్ సర్పంచ్ వల్లూరి పద్మ లింగయ్య, ఎంపీటీసీ మిర్యాల లక్ష్మమ్మ బీరయ్య తదితరులు పాల్గొన్నారు.