హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బైలాడిలా ఇనుప ఖనిజాన్ని రాష్ర్టానికి కేటాయిస్తే తామైనా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ఎక్కువని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన విషయంలో కేంద్రం రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు అవసరమైన నాణ్యమైన ముడి ఇనుము నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కేంద్రం కావాలనే తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి తన మంత్రిత్వశాఖ కాకపోయినప్పటికీ బయ్యారం ఇనుప ఖనిజం నాణ్యత లేనిదంటూ కేంద్రానికి సిఫారసు చేసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కిషన్రెడ్డి చెప్తున్నట్టు బయ్యారం ముడి ఇనుముకు నాణ్యత లేకపోతే బైలాడిలా నుంచి ఇనుప ఖనిజాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీలోని కడప జిల్లాలో, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయాలని విభజన చట్టం పేర్కొన్నదని గుర్తుచేశారు.
150-160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని వదిలి 1,800 కి.మీ దూరంలో ఉన్న గుజరాత్ ముంద్రాకు బైలాడిలా ఇనుప ఖనిజాన్ని తరలించి తద్వారా అదానీకి లబ్ధిచేకూర్చేందుకే కేంద్రం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ప్లాంట్ విషయంలో కేంద్రం ముందుకు రాకపోవడం వెనుక ఉన్న కారణాలను మంత్రి కేటీఆర్ బట్టబయలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వాస్తవాలు తెలియని బీజేపీ, కాంగ్రెస్ నేతలు లోపాయికారి ఒప్పందం చేసుకొని నిరుద్యోగ, గిరిజన బిడ్డల ఉపాధి అవకాశాలకు గండికొడుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీలకు ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాల్సిందే
అదానీకి లాభం చేకూర్చడం కోసం గిరిజనులను ఉరితీస్తారా? అని ఎంపీ మాలోత్ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులకు అనేకసార్లు విన్నవించినా కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్రం ఎజెండాగా పెట్టుకోగా, సీఎం కేసీఆర్ మాత్రం వాటి బలోపేతానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బయ్యారంలో ఉకు పరిశ్రమను నెలకొల్పేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కుపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నోరుమెదపకుండా రాష్ర్టానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యక్తిస్వామ్యానికి చోటులేదు
రాజకీయంగా, సామాజికంగా అత్యంత చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లాలో వ్యక్తిస్వామ్యానికి చోటు ఉండదని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఒకరు పంపిస్తేనో, మరొకరు అడ్డుకుంటేనో తాము అసెంబ్లీకి రాలేదని చెప్పారు. ‘మా చిన్నతనం నుంచి అసెంబ్లీకి వస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరేమి విర్రవీగినా ప్రజలే అంతిమ నిర్ణేతలు’ అని స్పష్టం చేశారు.