హైదరాబాద్ : తెలంగాణలో పండించిన ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తోన్న కేంద్రంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని పేర్కొన్నారు. ఉగాది వరకు ప్రశాంతంగా కేంద్రానికి నిరసనలు, వినతులు తెలుపుతామన్నారు. ఉగాది తర్వాత నూక ఎవరో, పొట్టు ఎవరో తేలుస్తామని తేల్చిచెప్పారు. సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి నూకలు తినిపించి చూడాలి. లేదా పీయూష్ గోయల్తో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యను అర్ద్రతతో కూడిన హృదయంతో చూడాలన్నారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్ష్యతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాం అని భావిస్తే అది శునకానందమే అవుతుందని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.