ఖమ్మం, నవంబర్ 19 : ఐదేండ్లలో రాజకీయాలకతీతంగా ఐదుతరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేశానని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆదివారం ఖమ్మం నగరంలో మంత్రి రోడ్ షో నిర్వహించారు. మహిళలు హారతులు ఇచ్చి.. విజయ తిలకందిద్ది ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మంత్రిగా కష్టపడి ఖమ్మంలో చేసిన అభివృద్ధిని.. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తాను చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. పెద్ద మనిషి అయి ఉండి అబద్ధాలు మాట్లాడుతున్నాడని అన్నారు.
మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డ అని ముద్దాడుతున్నట్టుగా ఆయన తీరు ఉన్నదని మండిపడ్డారు. ఇకడ జరిగిన అభివృద్ధికి ఎవరు కారణం? ఎవరు ఎన్ని నిధులు తెచ్చారు? అనే విషయాలు ప్రజలకు తెలుసని అన్నారు. సీఎం కేసీఆర్ నిధులు ఇస్తే.. ప్రతి పని దగ్గరుండి చేయించినట్టు చెప్పారు. తాను చేసిన అభివృద్ధితో ఖమ్మం ప్రాంతవాసుల ఆస్తుల విలువ గణనీయంగా పెరిగిందని, అంటే.. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టే కదా? అని అన్నారు. ఇకడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే ఖమ్మం కీర్తి ప్రతిష్ఠలు పెరిగినట్టు చెప్పారు. అవకాశవాద రాజకీయాలు చేసే వారిని నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.