జెడ్పీటీసీ రాజశేఖర్
కేటీదొడ్డి, మే 8 : రాష్ట్రంలోని పేదలు పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ బలంగా అనుకున్నారని, అందుకే క్రిస్మస్, బతుకమ్మ, రంజాన్ పండుగలకు కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నారని జెడ్పీటీసీ రాజశేఖర్ తెలిపారు. శనివారం ముస్లింలకు రంజాన్ కానుకలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12న రంజాన్ పండుగ సందర్భంగా దుస్తులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పండులను సంతోషంగా చేసుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కరోనా నేపథ్యంలో ముస్లింలు రంజాన్ పండుగను నిరాడంబరంగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, టీఆర్ఎస్ నేత చక్రధర్రావు, సర్పంచ్ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
అయిజలో..
అయిజ, మే 8 : మండలంలోని ఉప్పల క్యాంపు గ్రామంలో ముస్లింలకు శనివారం రంజాన్ కిట్లను టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటా ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో తోఫాలను పంపిణీ చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బాషా, అబ్దుల్ లతీఫ్, సమీర్, పాషా, హాఫీజ్ సాబ్, శాలిమియ్యా, అమీర్, వాజిద్, ఉమర్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.
గట్టులో..
గట్టు, మే 8 : ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా(కానుక)లను ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ విజయ్కుమార్ సూచించారు. చాగదోణలోని మసీదులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముస్లింలకు కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధిని ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ముస్లింలు ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. కరోనా నేపథ్యంలో నియమ, నిబంధనలకు అనుగుణంగా రంజాన్ పర్వదినాన్ని నిరాడంబరంగా చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ, టీఆర్ఎస్ నాయకులు అలీ, మునిచంద్రగౌడ్, ఎండీ బాబు, మౌలాలి, గూడుసాబ్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
మానవపాడులో..
మానవపాడు, మే 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని పేద ముస్లింలకు అందించిన తోఫాలను ముస్లిం మత పెద్ద ముతవలి మహబూబ్, సర్పంచ్ హైమావతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. శనివారం మండల కేంద్రంలోని జామియా మసీదులో మండలానికి మంజూరైన రెండు వందల కానుకల కిట్లను అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ పండుగను నిరాడంబరంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చోట, బాబుమియా, చాంద్ తదితరులు పాల్గొన్నారు.